బాల్యం అనేది ప్రతి చిన్నారి జీవితంలో అత్యంత విలువైన దశ అని బాల్యంలో విద్య ఆనందం ఆటపాటలతో గడపాల్సిన చిన్నారులు బాల కార్మిక వ్యవస్థ కారణంగా వారి హక్కులను కోల్పోతున్నారని పుస్తకాలను పట్టాల్సిన సమయంలో పనిముట్లను పట్టుకుని పనిచేయడం ద్వారా భవిష్యత్ చిన్నభినం అవుతుందని బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడం ప్రతి పౌరుడి సామాజిక బాధ్యతగా గుర్తించి ప్రతి చిన్నారి బడిలో చేర్పించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్నారు.
ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కార్మిక శాఖ, మహిళ శిశు సంక్షేమ శాఖ, ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్, వాసవ్య మహిళామండలి సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం భవానిపురంలోని పున్నమిఘాట్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన అవగాహన పోస్టర్లను జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ విడుదల చేసి అనంతరం ర్యాలీని ప్రారంభించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బాల్యంలో చిన్నారులు పుస్తకాలను పట్టాలి కాని పనిముట్లను కాదనే విషయాన్ని ప్రతి కుటుంబం గుర్తుంచుకోవాలన్నారు. చిన్న వయస్సులోనే పనుల్లో నిమగ్నమై తమ బాల్యాన్ని కోల్పోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. చిన్నారులు పనుల్లో కాకుండా పాఠశాలల్లో ఉండి విద్యాభ్యాసం చేయాలని, ఆరోగ్యంగా ఎదగాలని, యోగా వంటి ఆరోగ్యకరమైన అలవాట్లు అలవరచుకునేలా తల్లిదండ్రులు కృషి చేయాలన్నారు. చదువు ద్వారా పిల్లలలో ఉన్న ప్రతిభను వెలికితీయగలిగితేనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. బాల కార్మిక వ్యవస్థకు ముగింపు పలికితేనే భవిష్యత్తుకు బంగారు బాట ఏర్పడుతుందన్నారు. బాల కార్మిక వ్యవస్థను అరికట్టడం ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత గుర్తించాలన్నారు. బాల్యాన్ని కాపాడుతూ, ప్రతి చిన్నారికి విద్య హక్కును అందించగలిగిదే ఉత్తమ సామాజానికి బాటలు వేసిన వారమవుతామన్నారు. పిల్లలను పనిలో కాకుండా పాఠశాలలో చూడాలని సంకల్పంతో ముందుకు సాగాలని బాల్యాన్ని కాపాడి బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించి, పాఠశాలకు వెళ్లకుండా పనులు చేస్తున్న చిన్నారులను గుర్తించి సమీపంలోని పాఠశాలల్లో చేర్పించేలా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి బాలుడు, బాలిక విద్యను అభ్యసిస్తూ ఆరోగ్యంగా ఎదిగితేనే ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం సాధ్యమవుతుందని తెలిపారు.భవిష్యత్ తరాలను సుస్థిరంగా తీర్చిదిద్దాలంటే పిల్లల హక్కులను పరిరక్షించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ డిప్యూడి కమిషనర్ జి. ధనలక్ష్మీ, ఐసిడిఎస్ పిడి రుక్సానా సుల్తానా బేగం, ఫోరం ఫర్ చైల్డ్ జిల్లా కో-ఆర్డినేటర్ ఆరవ రమేష్, నగర పాలక సంస్థ అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇఇ శ్రీనివాసరావు, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ ఎం మధు తదితరులు పాల్గొన్నారు.